వరంగల్ రూరల్, నవంబర్ 29: నియోజకవర్గానికో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయమని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, అందులో భాగంగా వర్ధన్నపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఉద్యమానికి ఊపిరిలూదిన టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఉద్ఘాటించారు. దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్గా నిలవడం సీఎం కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనమని, గతంలో కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అని ఆయన అన్నారు. జనవరి నుంచి అన్ని కేటగిరిలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని, వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ. 8 వేల పెట్టుబడి ఇస్తామని, రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని కడియం శ్రీహరి ఉద్ఘాటించారు.