అమరావతి, నవంబర్ 29 : నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలకు భారీ జరిమానా విధించినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులపై చదువు ఒత్తిడి తెస్తూ రోజుకు 18 గంటలపాటు వారిని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించని నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలపై రూ. 50 లక్షల చొప్పున జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అయితే విద్యా సంస్థల యాజమాన్యాలతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారని, విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా వారిని ప్రశాంతమైన వాతావరణంలో చదివేలా చూడాలని యాజమాన్యాలకు హెచ్చరించారు. విద్యార్థుల ఆత్మహత్యలను కచ్చితంగా తగ్గించేలా చూస్తామని, వచ్చే విద్యా సంవత్సరానికి పక్కాగా నిబంధనలను అమలు చేస్తామని మంత్రి గంటా వెల్లడించారు.