న్యూఢిల్లీ, నవంబర్ 29 : గుజరాత్లో ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష పార్టీల ప్రచారం జోరందుకుంది. ఒకవైపు ప్రధాని మోదీ, మరోవైపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్ 9న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ నేడు సుడిగాలి పర్యటన చేయనున్నారు. మొత్తం 182 స్థానాల్లో సౌరాష్ట్ర నుంచే 48 మంది శాసనసభ సభ్యులుంటారు. సౌరాష్ట్రలో పాటిదార్, ఓబీసీ ప్రాబల్యం ఎక్కువ. పాటిదార్ ప్రాబల్యం ఉన్న మోర్బీ నుంచి మోదీ తన ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ కూడా తన ప్రచారాన్ని సౌరాష్ట్ర నుంచే ప్రారంభించనున్నారు. మొదటగా సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకుని రాహుల్ తన ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. ఆ తర్వాత రాహుల్ సవర్కుండ్లా, అమ్రేలీలోనూ ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటారు. ఈ ఇరువురు నేతలు సౌరాష్ట్ర నుండే ప్రచారం నిర్వహించడం విశేషం.