బాలి, నవంబర్ 28 : ఇండోనేషియాలోని బాలిలో అగంగ్ పర్వతం నుంచి లావా ఎగిసిపడుతుండడంతో స్థానికులను భద్రతా సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో అక్కడి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. బాలిలో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు భారత దౌత్యాధికారులు హెల్ప్లైన్ డెస్క్ను ఏర్పాటు చేసినట్లు, భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. "బాలిలో ఉన్న భారతీయులు అధైర్యపడొద్దు. జకార్తాలోని భారత రాయబారి ప్రదీప్ రావత్, కౌన్సిల్ జనరల్ సునీల్ బాబు మీకు అండగా ఉంటారు. నేను ఎప్పటికప్పుడు పరిస్థితిని వ్యక్తిగతంగా పరిశీలిస్తుంటాను’ అని ఆమె ట్వీట్ చేశారు. పెద్దఎత్తున లావా వెదజల్లడంతో చుట్టుపక్కల దట్టమైన ధూళి, బూడిద అలుముకొంది. దీంతో అక్కడ గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.