ముంబయి, నవంబర్ 28 : దూరప్రాంతలకు వెళ్లిన కుటుంబ సభ్యులు తమ వారితో మాట్లాడాలంటే వీడియో కాల్స్ చేస్తారన్న విషయం తెలిసిందే. మరి నియమ నిబంధనలు పాటించే జైలు ఖైదీలకు కూడా ఈ వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశాన్ని ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. సిటీలో ఉన్న జైళ్లలో రద్దీ కారణంగా యెరవాడ, తలోజా, ఔరంగాబాద్ వంటి సుదూర ప్రాంతాల్లో ఉండే జైళ్లకు పంపిన వారు తమ బంధువులతో కలిసేందుకు ఇబ్బందులు ఎదుర్కుంటున్న కారణంగా వారికి ఈ అవకాశాన్ని కల్పించినట్లు ఐజీ (జైళ్లు) రాజ్యవర్థన్ సిన్హా వెల్లడించారు. ఇటీవల బైకుల్లా జైల్లో జరిగిన ఖైదీ మంజులా షెత్యే మరణం కారణంగా తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా దీన్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ సదుపాయం అండర్ ట్రయల్స్ ఖైదీలకు లేదని ఆయన తెలిపారు.