న్యూఢిల్లీ, నవంబర్ 28 : తీవ్ర అనారోగ్యం పాలైన రైల్వే మంత్రి పీయుష్ గోయల్ ను చికిత్స నిమిత్తం హుటాహుటిన ముంబై సిటీ హాస్పిటల్ లో చేర్చారు. ఉన్నట్టుండి ఆయనకు కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చినట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారి తెలియజేశారు. ఇటీవల ప్రమాదం జరిగిన ఎలిఫెన్ స్టోన్ రైల్వే స్టేషన్ వద్ద నిర్మిస్తున్న పాదచారుల వంతెనను పరిశీలించేందుకు వచ్చిన పీయుష్ కు అకస్మాత్తుగా ఈ నొప్పి రాగా, వెంటనే అంబులెన్స్ ను పిలిపించామన్నారు. కాని పీయూష్ తన సొంత వాహనంలోనే ఆసుపత్రికి వెళ్లారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, బహుశా ఆయన ఎసిడిటీతో బాధపడుతూ ఉండవచ్చని అధికారిక వర్గాలు వెల్లడించారు.