ఉత్తరప్రదేశ్ లో ముగిసిన గాడిదల జైలు శిక్ష!

SMTV Desk 2017-11-28 11:57:34  donkeys, jail, bail, judge

లక్నో, నవంబర్ 28: ఉత్తరప్రదేశ్ లో మూగ జీవాలకు వింత పరిస్థితి ఎదురైంది. ఓ కోర్టు విధించిన నాలుగు రోజుల జైలు శిక్ష అనంతరం ఎనిమిది గాడిదలు, తిరిగి బాహ్య ప్రపంచంలోకి వచ్చాయి. ఈ గాడిదలు జైలు ఆవరణలోకి ప్రవేశించి ఖరీదైన మొక్కలను తిన్నాయన్న అభియోగాలపై, విచారించిన జులాన్ జిల్లా కోర్టు, నాలుగు రోజుల జైలు శిక్షను విధించగా, ఆ శిక్షను అధికారులు అమలు చేశారు. గాడిదలు జైల్లోకి వెళుతున్నప్పుడు ఉన్న పరిస్థితి ఏంటోగానీ, అవి బయటకు వచ్చేలోగా, విషయం మీడియాకు ఎక్కి ఆ గాడిదలు సెలబ్రిటీలుగా మారాయి. జైలు ఆవరణలోకి వస్తున్న గాడిదలు, మొక్కలను తింటున్నాయని, వాటిని జైలులోకి తోలవద్దని యజమానికి ఎన్నిసార్లు చెప్పినా వినలేదని, అందుకే ఫిర్యాదు చేశామని సిబ్బంది తెలిపారు. ఇక ఈ గాడిదలకు ఎంతకాలం పాటు జైలు శిక్ష విధించారన్న విషయం తెలియరాలేదుగానీ, ఓ స్థానిక రాజకీయ నాయకుడు, వాటికి బెయిల్ ఇచ్చేందుకు డబ్బులు కట్టగా, వాటిని విడుదల చేసినట్టు జైలు అధికారులు వెల్లడించారు. బెయిల్ పై బయటకు వచ్చిన గాడిదలు కోర్ట్ వాయిదాలకు ఎలా హాజరవుతాయో వేచి చూడాలి.