హైదరాబాద్, నవంబర్ 28 : గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో పాల్గొనడానికి హైదరాబాద్ చేరుకున్న ఇవాంకా ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనమైన బహుమతులు ఇచ్చి సత్కరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆ బహుమతులను ఖరారు చేశారు. మోదీకి రాష్ట్ర గుర్తింపుగా కాకతీయ కళాతోరణం నమూనాను, ఇవాంకాకు చార్మినార్ నమూనాను ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు. ఇవాంకాకు నమూనాతో పాటు తన కోసం ప్రత్యేకంగా తయారుచేసిన గొల్లభామ చీర, ముత్యాలు, గాజులను కూడా బహుమతులుగా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సదస్సులో పాల్గొనే ఇతర కేంద్ర మంత్రులకు తెలంగాణ ప్రభుత్వం ఘనమైన బహుమతులు ఇచ్చి సత్కరించాలని భావిస్తోంది.