అమరావతి, నవంబర్ 27 : రాజ్యాంగ విరుద్దంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కొని, మంత్రి పదవులు సైతం కట్టబెట్టిన తీరుకు నిరసనగా ప్రతిపక్ష వైసీపీ శీతాకాల అసెంబ్లీ సెషన్ ను బహిష్కరించింది. దీంతో ఏపి అసెంబ్లీ చప్పగా సాగుతోంది. అసెంబ్లీలో విపక్షం లేకపోవడంతో అక్కడ ఎమ్మెల్యేలు ఎవరూ పెద్దగా కనబడని పరిస్థితి ఏర్పడింది. సోమవారం నాడు కేవలం ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు మాత్రమే శాసనసభకు హాజరయ్యారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభను సీరియస్ గా నడపడం లేదని మంత్రులు, విప్ లు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారని సమాచారం. శాసనసభ్యులు అందరూ సభకు రావాలని ఆయన హెచ్చరించారు. ఈ వర్షాకాల సమావేశాలకు హాజరు కారాదని విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్ణయించడంతో ప్రభుత్వం ఇరుకున పడినట్లు అయింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని వైసీపీ గట్టిగా డిమాండ్ చేస్తున్న సంగతి విదితమే.