చెన్నై, నవంబర్ 25 : ఆర్కేనగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ తరఫున మరదు గణేశ్ బరిలోకి దిగుతారని ప్రతిపక్ష డీఎంకే ప్రకటించింది. నేడు ఉదయం అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ గణేశ్ పేరును వెల్లడించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆర్కే నగర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. శుక్రవారం ఈ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 21న ఎన్నికలు నిర్వహించి, 24న ఫలితాలు వెల్లడించనున్నారు. అన్నాడీఎంకేలోని పళని-పన్నీర్ వర్గం, దినకరన్ వర్గం ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. శశికళ అనుమతిస్తే ఈ ఎన్నికల్లో పోటీచేస్తానని ఇప్పటికే దినకరన్ ప్రకటించారు. మరోవైపు దినకరన్ కు పోటీగా, పళని-పన్నీర్ వర్గం కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపే పనిలో పడింది. ఈ వర్గం నుంచి మధుసూదన్ పేరు వినిపిస్తోంది.