న్యూయార్క్ , నవంబర్ 25 : గత ఆరు సంవత్సరాలుగా మధ్యదరా సముద్రం గుండా ప్రయాణిస్తున్నవారంత ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి ఓ ప్రకటనలో తెలిపింది. వివిధ దేశాల నుంచి అక్రమ మార్గంలో యూరోపియన్ యూనియన్ లోకి చేరుకునేందుకు మధ్యదరా సముద్రం మీదుగా వలసదారులు ప్రయాణిస్తున్నారు. ఇలా ప్రయాణిస్తూ ఈ సముద్రంలో 33,000 మంది జలసమాధి అయ్యారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. దీంతో మధ్యదరా సముద్రాన్ని అత్యంత ప్రాణాంతక సరిహద్దుగా గుర్తించారు. అయితే, శరణార్ధులను ఆదుకునే విషయంలో యూరోపియన్ యూనియన్, టర్కీతో ఒప్పందం చేసుకోవడం వల్ల కొన్ని మరణాలను తగ్గించగలిగిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎమ్) అభిప్రాయపడింది. ఈ ప్రకటనను యూరోపియన్ యూనివర్సిటీ అధ్యాపకుడు ఫిలిప్ తప్పుబట్టారు. వాస్తవానికి మధ్యదరా పొట్టనబెట్టుకున్న వారి సంఖ్య 33 వేలకు పైమాటేనని ఆయన అన్నారు.