న్యూఢిల్లీ, నవంబర్ 25: కదిలే బస్సులో కొందరు యువకులు దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. బస్సు కండక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని మధుర రోడ్డులో స్థానిక ఆశ్రమం వద్ద బస్సు ఆగినప్పుడు స్కూల్ యూనిఫాం ధరించిన కొందరు యువకులు, ఓ వ్యక్తి బస్సు ఎక్కారు. కాసేపటికే ఆ వ్యక్తి తన ఫోన్ పోయిందంటూ సదరు యువకుల బ్యాగుల్లో వెతకసాగాడు. ఈ క్రమంలో స్కూల్ విద్యార్థులకు, అతడికి మధ్య గొడవ జరిగింది. ఇంతలో ఆవేశానికి లోనైన ఓ విద్యార్థి తన వద్ద ఉన్న కత్తిని తీసి ఆ వ్యక్తి మెడలో బలంగా పొడిచాడు. అనంతరం వారంతా బస్సు నుంచి దూకి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం నిందితులు పారిపోయినట్లు కండక్టర్ తెలిపారు. ఈ వివరాలను ఆధారంగా చేసుకొని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.