సోనియాని ఎదిరించడం వల్లే జగన్‌పై కేసులు: చంద్రబాబు

SMTV Desk 2017-11-24 17:26:08  chandrababu, nallri kishor kumar reddy, jagan, soniya gandhi

విజయవాడ, నవంబర్ 24: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని ఎదిరించి మాట్లాడడంతో ఆమెకు కోపమొచ్చి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై కేసులు పెట్టించిందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం విజయవాడ గాయత్రి నగర్‌లోని మెట్రోపాలిటన్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషోర్‌ కుమార్‌ రెడ్డికి, అతని కుమారుడు నల్లారి అమర్‌నాథ్‌రెడ్డికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. కిషోర్‌కుమార్‌రెడ్డి తండ్రి నల్లారి అమర్‌నాథ్‌రెడ్డితోపాటు తాను ఎమ్మెల్యేగా పనిచేశానని చెప్పారు. నల్లారి కుటుంబం ప్రజాసేవ కోసం నిబద్దతతో పనిచేస్తోందన్నారు. మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా రాష్ట్రాన్ని విభజించవద్దని అప్పటి యూపీఏ ప్రభుత్వంతో పోరాడారని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను స్థాపించి జిల్లాను అభివృద్ధి చేస్తామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చంద్రబాబు రెండు నాల్కల ధోరణి బయటపడిందని, ఓ ప్రక్క జగన్ అవినీతి వల్లే కేసులు అంటూ, మరోప్రక్క సోనియా ను ఎదిరించడం వల్లే కేసులు అంటూ చంద్రబాబు బుకాయిస్తున్నారు అంటూ వైసీపీ నేతలు పేర్కొన్నారు.