కేంద్రం నిర్ణయం సరైంది కాదు : హరీష్ రావు

SMTV Desk 2017-06-13 15:02:07  Center giant burden,Incorrect, Harish Rao, Minister for Heavy Water Irrigation, Fertilizer prices

మెదక్, జూన్ 13 : తెలంగాణ రాష్ట్రం లో పన్ను విధింపు చర్యల్లో రైతులపై అదనపు భారం పడేలా కేంద్రం ఎరువుల పై జీఎస్టీ వేయటం సరికాదని భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు అన్నారు. జీఎస్టీతో ఎరువుల ధరలు పెరుగుతాయని, తద్వారా రైతుల పై మరింత భారం పడుతోందని చెప్పారు. సోమవారం డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో కలసి మెదక్ లో ఆయన పర్యటించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో బీడీ కార్మికులకు జీవన భృతి పత్రాలు అందజేశారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం వెంటనే ఎరువుల పై జీఎస్టీ ఎత్తివేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. వరి మద్దతు ధర పెంచాలని పలుమార్లు కోరినప్పటికీ కేంద్రం స్పదించడం లేదన్నారు. ఉత్తర భారత్ లో అధికంగా సాగయ్యే గోధుమల మద్దతు ధర పెంచిందని, తెలంగాణలో రైతులు అత్యధికంగా సాగు చేసే వరి మద్దతు ధర మాత్రం పెంచటంలేదని అన్నారు. బీడీ కార్మికులకు జీఎస్టీ రూపంలో దెబ్బ పడనుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ బీడీ కార్మికులకు పన్ను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. కేంద్రం పన్ను విధిస్తూ కార్మికుల పొట్ట కొడుతుందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని హరీశ్ చెప్పారు.గత ప్రభుత్వాలు కులవృత్తులను విష్మరిస్తే, కేసీఆర్ కులవృత్తి దారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. విదేశాల్లో చదివే బీసీ విద్యార్ధుల కోసం రూ.20 లక్షలు అందజేస్తామని హరీశ్ వెల్లడించారు.