న్యూఢిల్లీ, నవంబర్ 24 : కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) శుక్రవారం సమావేశమై, డిసెంబర్ 15 నుంచి జనవరి 5 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్కుమార్ మీడియాకు వెల్లడించారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా అనేక కీలక అంశాలపై చర్చించాల్సి ఉందని, కీలక బిల్లులు సైతం సభ ముందుకు రానున్నందున సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అనంత్కుమార్ కోరారు. ఈ సమావేశాల్లో ముమ్మారు తలాక్, ఎన్సీబీసీ తదితర ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.