హైదరాబాద్, జూన్ 13 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం కోసం కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి అనుగుణంగా వినియోగదారులకు తేలికగా అందుబాటులో ఉండేందుకు అవసరమైన గొర్రెలను వెతికేందుకు pashubazar.telangana.gov.in అనే వెబ్సైట్ రూపొందించింది. గొర్రెల పెంపకదారులు ఈ వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకొని, ఎన్ని గొర్రెలు విక్రయిస్తారో వివరాలు తెలియజేస్తే కొనుగోలు చేస్తామని పశుసంవర్ధక శాఖ తెలిపింది. పశువులు అమ్మడానికి, కొనడానికి వేదికగా ఈ వెబ్సైట్ పనిచేస్తుందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్చందా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఈ వెబ్సైట్ను ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిసారీ మార్కెట్కు వెళ్లకుండా ఈ వెబ్సైట్ ద్వారానే తమ పశువులను మంచి ధరకు అమ్ముకోవచ్చన్నారు. ప్రస్తుతం ఈ వెబ్సైట్ను ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం కింద గొర్రెలను కొనుగోలు చేసేందుకు ఉపయోగిస్తామన్నారు. వెబ్సైట్ను ఉపయోగించడం రానివారు హెల్ప్లైన్ నెంబర్ ‘7337362131’ లేదా టోల్ఫ్రీ నంబర్ 1800–599–3699కు ఫోన్ చేయవచ్చున్నారు.