న్యూఢిల్లీ, నవంబర్ 23 : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ని ఆమలులోకి తీసుకురావడంతో పరోక్ష పన్నుల విధానం సమూలంగా మారిపోయింది. ఇప్పుడు తాజాగా ప్రత్యక్ష పన్నుల ప్రక్షాళనకు పూనుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితం కొత్త డైరెక్ట్ టాక్స్ కోడ్ ముసాయిదా రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన పన్ను చట్టాల నిపుణుడు, ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సిబిడిటి) సభ్యులు అరవింద్ మోదీకే మరోసారి బాధ్యతలను అప్పగించింది. ఆర్థిక వ్యవస్థలో సమకాలీన అవసరాలకు తగ్గట్టుగా డ్రాఫ్ట్ను రూపొందించడం ఈ ప్యానెల్ బాధ్యత. యాభై ఏళ్లకు పైగా పాతబడిన ఆదాయ పన్ను చట్టాలను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని సెప్టెంబరులో జరిగిన పన్ను అధికారుల వార్షిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ప్రస్తుత చట్టాన్ని సమీక్షించడంతోపాటు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సరికొత్త చట్టాన్ని ప్రవేశపెట్టేందు కోసం రూపొందించేందుకు టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశాం’’ అని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది.