కర్నూల్, నవంబర్ 23: అశేష జనవాహిని మధ్య విపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి 16వ రోజు ప్రజాసంకల్పయాత్ర ను కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్ రోడ్డు నుంచి ప్రారంభించారు. అభిమాన సంద్రం మధ్య ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. రామల్లెపల్లె నుంచి ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం వైఎస్ జగన్ బోయినపల్లి క్రాస్ రోడ్డు చేరుకుంటారు. అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు రత్నపల్లి క్రాస్రోడు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర పునఃప్రారంభం అవుతుంది. ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాయంత్రం 5 గంటలకు వెల్దుర్తి చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ అనంతరం రాత్రి 7.30 గంటలకు వైఎస్ జగన్ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సిన నేపధ్యంలో హైదరాబాద్ కు పయనమవుతారు. 15వ రోజు పాదయాత్రలో వైఎస్ జగన్ రెండు వందల కిలోమీటర్ల మార్కును చేరుకున్న విషయం తెలిసిందే. తిరిగి పాదయాత్ర శనివారం మొదలవుతుంది.