హైదరాబాద్, నవంబర్ 22: వచ్చే ఎన్నికలలో తెలంగాణా గద్దెక్కాలనే దృఢ సంకల్పంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలపై దృష్టి సారించిందని కథనాలు వస్తున్నాయి. ఆ నియోజకవర్గాలలో అధిక శాతం గెలువగలిగితే అధికారం కష్టం కాదని ఆ పార్టీ భావిస్తోంది. తెలంగాణలో ముప్పై ఒక్క ఎస్.సి, ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో విజయానికి ఒక ప్రణాళికను సిద్దం చేశారు. ఈ నియోజకవర్గాలలో నాయకత్వం అభివృద్ది పేరుతో దీనిని అమలు చేస్తారట. దీనికి వారు పంజాబ్ మోడల్ అని పేరు పెట్టుకున్నారు. అక్కడ ఇలాగే రిజర్వుడ్ నియోజకవర్గాలలో నాయకత్వాన్ని అభివృద్ది చేసి విజయం సాధించారని చెబుతున్నారు. తెలంగాణలోనూ ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు ఆధ్వర్యంలో జూన్ నెలలో ప్రారంభించారు. గాంధీభవన్లో జిల్లాల వారీగా నియోజకవర్గాల సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా మాట్లాడుతూ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి నుంచి అన్ని అనుబంధ సంఘాలు చేపట్టిన కార్యక్రమాలు పార్టీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.