విజయవాడ, నవంబర్ 22 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంట దిగుబడుల సాధనలో పంజాబ్ రాష్ట్రాన్ని అధిగమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని ఫార్చూన్ హోటల్లో నేడు జరుగుతున్న ఇండియా రైస్ కాంక్లేవ్లో హాజరైన సీఎం రాష్ట్ర వ్యవసాయ-సహకార శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వరి దిగుబడి చేస్తోన్న ప్రాంతాలతో పోటీపడాల్సిన తరుణమిదేనని ఈ నేపథ్యంలో చైనా కంటే ముందు నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచంలో మంచి సాంకేతికత ఎక్కడున్నా, అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలున్నా వాటిని దిగుమతి చేసుకుని అమలు చేసేందుకు రైతులు ఆసక్తిగా చూపుతున్నరన్నారు. వరిలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, సాంకేతికత వినియోగించడం, రైతులకు ఉత్తమ పద్ధతులను వివరించి ఆచరింపచేయడం ద్వారా పంజాబ్, చైనాను మించి దిగుబడులు సాధించే వీలుంటుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.