అమరావతి, నవంబర్ 22 : అసెంబ్లీ లాబీలో టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా విషయం కలకలం సృష్టించింది. హనుమాన్ జంక్షన్ లో ఉన్న డెల్టా షుగర్స్ సంస్థ గత నాలుగు నెలలుగా మూతపడింది. దీన్ని తణుకుకు మార్చాలనే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడే ఉంచాలని... ఇక్కడ నుంచి తరలిస్తే, ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోతారని వంశీ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి, చెరుకు రైతులతో కలసి ఆయన వినతి పత్రంను సీఎంకు అందజేశారు. ఈ రోజు కూడా ఈ విషయంపై చర్చించేందుకు రైతులతో కలసి సీఎం కార్యాలయానికి వంశీ వచ్చే సరికి, ఆయనతో సీఎం కార్యాలయ అధికారులు దురుసుగా ప్రవర్తించారు. ముఖ్యంగా గిరిజా శంకర్ ఆయనతో అమర్యాదగా ప్రవర్తించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కంట తడి పెట్టుకొని రాజీనామాకు సిద్ధమయ్యారు. రాజీనామా లేఖను స్పీకర్ కోడెల శివప్రసాద్ కు ఇచ్చేందుకు ఆయన అసెంబ్లీకి వెళ్ళగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్... వల్లభనేని వంశీని ఆపి, రాజీనామా లేఖను చింపివేసినట్లు తెలుస్తుంది. ఈ సంగతి తెలిసిన మంత్రి లోకేష్ వంశీని శాతింపజేసే బాధ్యతను మంత్రి కళా వెంకట్రావుకు అప్పగించారు.