న్యూఢిల్లీ, నవంబర్ 20: భారత్, చైనాలు ఇరుగుపొరుగుగా కలిసుండాల్సిందేనని, అది ప్రపంచ శాంతికి అవసరం అని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా పేర్కొన్నారు. మరింత కారుణ్య ప్రపంచాన్ని సాధించేందుకు రెండు దేశాలూ కలసి పనిచేయాలని కోరారు. చైనా నుంచి స్వాతంత్య్రాన్ని టిబెటన్లు కోరుకోవడంలేదని, అర్థవంతమైన స్వయంప్రతిపత్తినే అడుగుతున్నారని పేర్కొన్నారు. ఐరోపా సంఘం స్ఫూర్తి తనను ఆకట్టుకుందన్నారు. భారత సమాఖ్య అనే ఆలోచన గొప్పదని వివరించారు. భిన్న భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ సమైక్య భారత స్ఫూర్తి అద్భుతమన్నారు. ఇన్ని వైరుద్ధ్యాలున్నప్పటికీ ఆసియా దేశాలన్నింటిలోనూ భారత్ అత్యంత సుస్థిర, శాంతియుత దేశమని చెప్పారు. పురాతన భారత విజ్ఞాన వ్యవస్థ అద్భుతమని కొనియాడారు. నాటి నలంద విశ్వవిద్యాలయంలో అనేక దేశాలకు చెందిన విద్యార్థులు చదువుకున్నారని చెప్పారు.