న్యూఢిల్లీ, నవంబర్ 19: యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏడు నెలల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఘజియాబాద్లోని రామ్లీలా మైదానంలో ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నేరగాళ్లు రాష్ట్రం విడిచిపెట్టి పారిపోతున్నారని అన్నారు. అమాయకులను హింసించేవారు, మహిళలపై దాడులు చేసేవారిని తాము సహించబోమని అన్నారు. వారికి రెండే చోట్లు ఉన్నాయని, ఒకటి జైలు రెండోది యమరాజు ఇల్లు (నరకం) అని అభివర్ణించారు. నేరగాళ్లను జైలుకు పంపిస్తామని, కుదరకపోతే ఎన్కౌంటర్లో కాల్చి చంపుతామని యోగి వివరించారు. అరాచకాలకు తాళలేక రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, యువత ఇప్పుడు తిరిగి వస్తున్నారని, పెట్టుబడులు కూడా రాష్ట్రానికి వస్తున్నాయని యోగి పేర్కొన్నారు.