శ్రీనగర్, నవంబర్ 19 : ఏళ్ల తరబడి తల్లి కొంగు చాటున ఉండే పిల్లలు ఎదిగిన తరువాత తల్లిదండ్రులను తీసుకోవాల్సింది పోయి, ఉగ్ర బాట పడుతున్నారు. ఆ బాటలోనే వెళ్లిన మాజిద్ ఖాన్ అనే యువకుడు తన తల్లి అభ్యర్థనకు చలించి ఉగ్రవాదాన్ని వీడి పోలీసులకు లొంగిపోయాడు. పుల్వామాకు చెందిన 20 ఏళ్ల మంజూర్ అహ్మద్ బాబా ఇటీవలే ఉగ్రవాదిగా మారాడు. దీంతో ఆ యువకుడి తల్లి వెనక్కి వచ్చేయాలంటూ అభ్యర్థిస్తూ రూపొందించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ‘నా కుమారుడు మీ ఉగ్ర సంస్థలో ఉన్నట్లయితే అతన్ని వెంటనే పంపించేయండి.. నాకు నా కుమారుడు తప్ప ఇంకెవరూ లేరు’ అని ఆమె అభ్యరిస్థున్న వీడియో పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఇటీవల మాజిద్ ఖాన్ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి కూడా అతడి తల్లే కారణం. ఇంటికి వచ్చేయాలంటూ తల్లి అభ్యర్థించడంతో దాన్ని సోషల్మీడియాలో చూసి ఫుట్బాల్ గోల్ కీపర్ అయిన మాజిద్ ఖాన్ శుక్రవారం పోలీసులకు లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో కశ్మీర్లో మరికొందరు తల్లులు సైతం అదే పంథాని ఎంచుకున్నారు. ఉగ్రమూక నుంచి తమ చెంతకు వచ్చేయాలంటూ తాజాగా కశ్మీర్కు చెందిన మరో రెండు కుటుంబాలు అభ్యర్థించాయి. దీనిపై తమ కుమారులు స్పందించి తిరిగొస్తారన్న ఆశతో వారు ఎదురుచూస్తున్నారు.