హైదరాబాద్, నవంబర్ 19 : గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం వరాలు ప్రకటించింది. శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన ప్రజాప్రతినిధులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 70 కోట్ల మేర విద్యుత్ బకాయిలతో పాటు, వారిపై ఉన్న విద్యుత్ కేసులన్నీ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అన్ని ఎస్టీ ఆవాసాలు, ఇళ్లు ప్రతి ఎస్టీ వ్యవసాయ దారుడికి నామమాత్ర రుసుముతో విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే గిరిజన ఆవాసాలన్నింటికీ రహదారులు వేసేందుకు వచ్చే బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్న కేసీఆర్ ఆదివాసి ప్రాంతాల్లో గురుకుల పాఠశాలను నెలకొల్పి స్థానికులకే ప్రవేశాలు కల్పిస్తామని హామీఇచ్చారు. గొర్రెల పెంపకం లాంటి స్వయం ఉపాది పథకాన్ని గిరిజనులకు వర్తింపజేస్తామన్నారు. కాగా, వివిధ అంశాలపై ఎస్టీ ప్రజాప్రతినిధులతో మూడు కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్శర్మ, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు, డీజీపీ మహేందర్రెడ్డి, ఎంపీలు సీతారాంనాయక్, నగేశ్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.