న్యూ ఢిల్లీ, జూన్ 12 : ఆదాయం పన్ను శాఖ పంపే రిటర్నుల పరిశీలన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని తప్పనుంది. తమ వాదనను సమర్ధించుకోగలిగే పత్రాలు అందుబాటులో ఉన్న పన్ను చెల్లింపుదారులు, ఆన్ లైన్ లోనే వివరణ ఇవ్వవచ్చునని ఆదాయ పన్ను శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. ఆ పత్రాలను ఐటీ శాఖ ఈ-ఫీలింగ్ పోర్టల్ లోనే అప్ లోడ్ చేసేందుకు ప్రత్యేక వసతి త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు. మౌఖిక సంప్రదింపులను తగ్గించడంతో పాటు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. అంతే కాకుండా పరిశీలన నోటీసు అందుకున్న పన్ను చెల్లింపుదారుడి తో మదింపు అధికారి ఎస్ఎంఎస్ ద్వారా సంప్రదింపులు జరుపగలిగే సౌకర్యాన్ని సైతం త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు ఆయన తెలిపారు. పన్ను చెల్లింపులు, సలహాలు, సూచనలు, తదితర వివరాలను వెబ్ సైట్ లో పొందుపరుచనున్నామని పేర్కొన్నారు.