గుజరాత్ నుండి బీజేపీని తరిమికొట్ట౦డి: హార్దిక్ పటేల్

SMTV Desk 2017-11-19 14:38:13  hardik patel about bjp, Gujarat elections, Gujarat updates

అహ్మదాబాద్, నవంబర్ 19: గుజరాత్ ఎన్నికలను బీజేపీని తరిమికొట్టే యుద్ధమని అభివర్ణించారు పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్. గుజరాత్ ప్రజలు అభివృద్ధి సీడీని చూడాలనుకుంటున్నారు గానీ, సెక్స్ సీడీలు కాదని మరోసారి హార్దిక్ అన్నారు. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) నేత అయిన హార్దిక్ శనివారం మన్సాలో నిర్వహించిన ర్యాలీలో బీజేపీ లక్ష్యంగా విమర్శల వర్షం కురిపించారు. మన్సా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సొంతూరు కావడం గమనార్హం. ఇక్కడే 2015లో రిజర్వేషన్లు కోరుతూ పటేల్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడదే వేదికగా 45 నిమిషాల తన ప్రసంగంలో బీజేపీపై మాటల యుద్ధానికి దిగారు హార్దిక్. సీఎం విజయ్ రూపానీ, ఇతర పోలీస్ పెద్దల ఒత్తిడి మేరకే తమకు అనుమతి ఇవ్వలేదని, అయినా తమకు ఎవరి అనుమతీ అవసరం లేదని ఈ సందర్భంగా హార్దిక్ స్పష్టంచేశారు. గుజరాత్ ఎన్నికలలో బీజేపీ ఓటమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు.