వరంగల్, నవంబర్ 19 : అభివృద్ధి పనులు, పార్టీ కార్యకలాపాలలో పురపాలక ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. వరంగల్ కాకతీయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన తెరాసా బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్.. అన్ని వర్గాల వారి సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కేసీఆర్ కిట్ పథకానికి మంచి స్పందన లభిస్తుందని, అభివృద్ధి పథంలో వరంగల్ దూసుకుపోతుందని తెలిపారు. టెక్స్ట్ టైల్స్ పార్కు ద్వారా స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్ పారిశ్రామిక కారిడార్ తో కొత్త పరిశ్రమలు వస్తాయన్నారు. మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్దరించనున్నట్లు ప్రకటించారు. కాగా రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ను పాతాళానికి తొక్కితేనే బంగారు తెలంగాణ సాధ్యమని స్పష్టం చేశారు.