పాకిస్తాన్, నవంబర్ 19 : పాకిస్తాన్ వక్ర బుద్ధిని ప్రదర్శి౦చింది. ఇండియాను ఇరకాటంలో పెట్టాలని భావిస్తూ అడ్డంగా దొరికిపోయింది. విషయమేమిటంటే.. భారత విద్యార్థిని ఇండియాకు వ్యతిరేకంగా పెట్టిన ఓ పోస్టు అంటూ, మార్ఫింగ్ చేసిన ఫొటోను పాకిస్తాన్ వాసులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అసలు జరిగిందేంటంటే.. ఢిల్లీ వర్సిటీకి చెందిన కవాల్ ప్రీత్ కౌర్ అనే లా స్టూడెంట్, ఈ సంవత్సరం జూన్ లో ఓ ప్లకార్డు పట్టుకుని ఉన్న ఫొటోను పోస్టు చేసింది. ఆ ప్లకార్డుపై "భారతీయులుగా రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని గౌరవించాలని కోరుతూ, ముస్లిం ప్రజలపై జరుగుతున్న దాడులను ఖండించాలి" అని రాసి, జమా మసీద్ వద్ద ఫొటో దిగి సోషల్ మీడియాలో పెట్టింది. ఈ ఫోటోను ఆసరాగా తీసుకొని మార్ఫింగ్ చేసిన ఫోటోను పాక్ డిఫెన్స్ తన అధికారిక పేజీలో షేర్ చేసుకుంది. ప్లకార్డుపై ఉన్న మాటలను, "నేను భారతీయురాలినే అయినా, భారత్ అంటే తనకు ఇష్టం లేదని, వలస వాదాలకు ఇది కేరాఫ్ అడ్రస్ అని, నాగాలు, కశ్మీరీలు, మణిపూరీలు, హైదరాబాదీలు ఆక్రమించుకున్న దేశమని మార్చింది". భారత్ కు వ్యతిరేకంగా ఉన్న ఈ ఫోటోల పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొంది. మార్ఫింగ్ ఫోటోలు పెట్టడంతో పాకిస్థాన్ డిఫెన్స్ ఫోరమ్కు చెందిన ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాలను నిలిపివేశారు.