కర్నూలు, నవంబర్ 19: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు ఆదివారం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల నియోజకవర్గంలో కొనసాగనుంది. ఈ ఉదయం 8.30 గంటలకు సౌదరదిన్నె నుంచి 12వ రోజు యాత్రను ఆయన మొదలుపెట్టారు. జననేత వెంట నడిచేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలుకరించి వైఎస్ జగన్ ముందుకు సాగారు. ఆమదాల క్రాస్ రోడ్డు, గులాంనబీ పేట-బొందల దిన్నెక్రాస్ రోడ్డు, ఎల్లురి కొత్తపేట, బనగాలపల్లి మీదుగా ఆయన ఈరోజు పాదయాత్ర చేస్తారు. సాయంత్రం బనగాలపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బనగాలపల్లిలో ఆయన బస చేస్తారు. 11 రోజుల పాటు చేసిన పాదయాత్రలో ఇప్పటివరకు వైఎస్ జగన్ 154 కిలోమీటర్లు నడిచారు.