హైదరాబాద్, నవంబర్ 19 : గిరిజనులకు చెందిన ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రగతి భవన్ లో అధికారులతో సమావేశమై ఎస్టీలకు వరాలు ప్రకటించారు. వారికి 70 కోట్ల మేర విద్యుత్ బకాయిలతో పాటు వారిపై ఉన్న విద్యుత్ కేసులన్ని రద్దు చేసినట్లు తెలిపారు. అన్ని ఎస్టీ ఆవాసాలు, ఇళ్ళతో పాటు ప్రతి ఎస్టీ వ్యవసాయదారుడికి నామమాత్రపు రుసుముతో విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. గిరిజనుల ఆవాసాలన్నింటికి రహదారులు వేసేందుకు వచ్చే బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్న కేసీఆర్.. ఆదివాసాల్లో గురుకుల పాఠశాలలను నెలకొల్పి స్థానికులకై ప్రవేశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్టీల స్వయం ఉపాధి కోసం ఆర్ధిక సహాయం అందిస్తామని, పథకాల రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. ఎస్టీ ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయి సమన్వయంతో జాతులు, తెగల మధ్య ఐక్యత సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.