హైదరాబాద్, నవంబర్ 18: ధూప దీప నైవేద్య పథకాన్ని సమర్థవంతగా అమలు చేయుటకు తోడ్పాటునందించాలని గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణ ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామ ప్రజల నుంచి వస్తున్న విజ్ఞాపనల మేరకు ధూప దీప నైవేద్య పథకాన్ని మరిన్ని ఆలయాలకు వర్తింపజేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ధూప దీప నైవేద్య పథకాన్ని కొత్తగా మరో 3 వేల ఆలయాలకు వర్తింపజేస్తూ దేవాదాయ శాఖ జీవో జారీ చేసిందని లేఖలో పేర్కొన్నారు. నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారం డిసెంబర్ 8,2017 తేది లోగా అర్చకులు ధూప దీప నైవేద్య పథకంకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఆలయాల్లో పని చేస్తున్న అర్చకులు జిల్లా సంబంధిత దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరోవైపు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలను అభివృద్ది చేయడంతో పాటు మారుమూల పల్లెల్లో నిరాదారణకు గురైన ఆలయాల్లో నిత్య పూజలు జరగడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. గతంలో ధూప దీప పథకం ద్వారా 1805 ఆలయాలకు రూ. 2500 ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.6000 లకు పెంచారన్నారు.