పాట్నా, నవంబర్ 18 : విద్యార్ధుల విద్య పై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్న ఘటనలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి. తాజాగా బీహార్ ప్రభుత్వం ఇలాంటి ఘటనకు కేంద్ర బిందువుగా నిలిచింది. వివరాల్లోకి వెళితే... బీహార్కు చెందిన పదో తరగతి విద్యార్థి ధనుంజయ్ కుమార్ పరీక్షలు చాలా బాగా రాసినప్పటికీ అతడికి హిందీలో 2మార్కులు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు ధనుంజయ్ని అడ్డుకొని, మార్కుల విషయంలో అనుమానం వచ్చి ఆర్టీఐ ద్వారా విషయాన్ని వెలుగులో తెచ్చారు. ఆర్టీఐ నివేదిక ప్రకారం ధనుంజయ్కు హిందీలో మొత్తం 79 మార్కులు వచ్చాయి. కానీ అధికారులు మాత్రం అతడికి రెండు మార్కులు వేసి మొత్తం 500 మార్కులకు 344 వచ్చినట్లు వేశారు. కానీ అతడు 500 మార్కులకు గాను 421 మార్కులు సాధించినట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. దీంతో బీహార్ స్కూల్ బోర్డు నిర్వాకం వెలుగులోకి వచ్చింది. బీహార్ లో ఇలాంటి ఘటనలు కొత్త కాదు. ఇంతకుముందు విద్యార్ధులకు, సరిగా మార్కులు వేయకపోవడం, హాల్ టికెట్లపై గుర్తింపుగా ఉండే వారి ఫొటోలకు బదులు, దేవుడి ఫొటోలు ముద్రించడమే కాకుండా, రూబీ రాయ్ టాపర్ స్కాంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.