న్యూఢిల్లీ, నవంబర్ 18 : గువహతి వేదికగా ఈ నెల 10న జరిగిన, 23వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దాదాపు 200 వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం, ఎమ్మార్పీ ధరలకు అనుగుణంగా స్టిక్కరింగ్ చేసుకునే వెసులుబాటును కంపెనీలకు కల్పించింది. డిసెంబర్ వరకు ప్యాక్ చేసిన వస్తువులపై స్టిక్కర్ వేసుకునే వెసులుబాటును అందిస్తున్నట్లు తెలిపింది. ఇంతకుముందు జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ప్యాక్ చేసిన వస్తువులపై సవరించిన ఎమ్మార్పీని స్టిక్కర్ ముద్రించుకునేందుకు కేంద్రం సెప్టెంబర్ వరకు అవకాశం కల్పించింది. ఈ విషయం పై వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి రామ్విలాస్ పాసవాన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కొన్ని సరుకులు మీద జీఎస్టీ రేట్లు తగ్గిన నేపథ్యంలో సవరించిన ఎమ్మార్పీని ప్యాక్చేసిన వస్తువులపై స్టిక్కర్ లేదా ఆన్లైన్లో ప్రింటింగ్కు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.