భోపాల్, నవంబర్ 18 : పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా మోదీ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ప్రజలు కూడా వడివడిగా డిజిటల్ బాట పడుతున్నారు. ఈ సందర్భంగా దేశాన్ని మరింత ప్రగతి పథం వైపు నడిపించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో వాడే చెక్ బుక్ సదుపాయానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్దంగా ఉందని, పరిశ్రమ వర్గాల సమాఖ్య (కాయిట్) తెలిపింది. ఇదే జరిగితే ప్రజలు డిజిటల్ వైపు మొగ్గుచూపడం అనివార్యం కాక తప్పదు. డిజిటల్ ‘రథ్’ కార్యక్రమంలో పాల్గొన్న భారత వ్యాపారుల సమాఖ్య (కాయిట్) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో చెక్బుక్ సదుపాయాన్ని ఉపసంహరించే అవకాశం ఉందని, దేశంలో డిజిటల్ లావాదేవీల పెంపునకు సమీప భవిష్యత్లో ఈ మార్పుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.