న్యూఢిల్లీ, నవంబర్ 17 :ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తమ ఖాతా దారులు నిబంధనలును అతిక్రమిస్తే, పేరు పక్కన ఉండే వెరిఫైడ్ నీలం రంగు చెక్ మార్క్ను తొలగిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా ట్విట్టర్ వినయోగాదారులకు ఎటువంటి ముందస్తు సమాచారం అందించకుండా, వారి వెరిఫైడ్ గుర్తును తొలగించడం జరుగుతుందని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ నిర్వాహకులు వెల్లడించారు. 2009 నుంచి ప్రముఖులకు, సెలబ్రెటీలకు, పాపులర్ వ్యక్తులకు వారి ట్విటర్ ఖాతా పేరు పక్కన వెరిఫికేషన్ గుర్తును ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం వెరిఫికేషన్ కోసం వచ్చే దరఖాస్తులను తీసుకోవడం నిలిపివేసినట్లు కంపెనీ పేర్కొంది. ఉదాహరణకు.. వేధింపులకు గురి చేయడం, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టడం వంటివి ట్వీట్ చేసినా.. ఆ ఖాతాకు ఉన్న వెరిఫైడ్ గుర్తును తొలగిస్తారు. ట్విట్టర్ సంస్థను జాక్ దోర్సే అనే వ్యక్తి తన స్నేహితుల సహాయంతో మార్చ్21, 2006 న అమెరికాలో స్థాపించారు. తాజాగా ట్విట్టర్ సంస్థ ట్విట్ చేసే అక్షరాల పరిమితిని 140 నుండి 280 కు పెంచిన విషయం తెలిసిందే.