కోచి, నవంబర్ 17 : భారత్ లో ఇప్పుడు లీగ్ ల హోరు నడుస్తుంది. వీటిలో ఐపీఎల్ తొలి స్థానంలో ఉండగా, ప్రో కబడ్డీ తర్వాతి స్థానంలో నిలుస్తుంది. ఇప్పుడు తాజాగా మరో లీగ్ ఇండియన్ అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. అదే ఇండియన్ సూపర్ లీగ్... భారత్లో మరే టోర్నీ లేని స్థాయిలో ఏకంగా నాలుగు నెలల పాటు ఫుట్బాల్ ప్రియులకు వినోదం పంచనుంది. ఈ టోర్నీ 2014 అక్టోబరు 12 న ప్రారంభమైంది. తొలి సీజన్లో 70 రోజులు తర్వాతి రెండు సీజన్లలో 80 రోజుల చొప్పున ఉన్న లీగ్, నాలుగో సీజన్లో మాత్రం ఏకంగా 108 రోజులకు పెరిగింది. ఈ రోజు కోచిలో జరిగే తొలి మ్యాచ్లో గత ఏడాది విజేత అట్లెటికో డి కోల్కతా, రన్నరప్ కేరళ బ్లాస్టర్స్ పోటి పడనున్నాయి. ఈ సారి తుది జట్టులో భారత ఆటగాళ్ల సంఖ్య ఆరుకు, విదేశీయులు ఐదుగురే ఆడటం విశేషం. అంతే కాకుండా ఈ సారి రెండు కొత్త జట్లు, బెంగళూరు ఎఫ్సీతో పాటు జంషెడ్పూర్ ఎఫ్సీ కూడా లీగ్లోకి అడుగుపెడుతున్నాయి.