శ్రీనగర్, జూన్ 11 : ఉగ్రవాదుల అగడలు రోజు రోజుకి పెరిగి పోతుండడంతో వీటిని అరికట్టేందుకు భారత జవాన్లు సమర్ధవంతంగా కృషి చేస్తున్నారు. ఉత్తర కశ్మీర్ ఉగ్రవాదుల చొరబాటుకు యత్నించగా వారి ప్రయత్నాన్ని భారత ఆర్మీ సమర్ధవంతంగా అడ్డుకుంది. బండిపొరా జిల్లా గురేజ్ సెక్టర్ లో ఉన్న నియంత్రణ రేఖ వద్ద భారత్ లోకి చొరబడేందుకు శనివారం ఉగ్రవాదులు ప్రయత్నించారు. దీనిని గుర్తించిన భద్రతా దళాలు హుట హుటిన వారిపైకి కాల్పులు జరిపాయి. భద్రత దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించడంతో తీవ్ర పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల నియంత్రణ రేఖ వద్ద గత నాలుగు రోజుల్లో జరిగిన ఎన్ కౌంటర్ల లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యా 14కు చేరింది. ఈ ఎన్ కౌంటర్ లో ఒక ఆర్మీ జవాను కూడా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. కుప్వారా జిల్లాలోని మచ్చిల్, నౌగాం సెక్టార్లు, బారాముల్లాలోని ఉడీలో ఉగ్రవాదులు ఇటివల చొరబాటుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. పాకిస్తానీ దళాల సహకారంతోనే ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు వచ్చారని ఓ ఆర్మీ అధికారి వెల్లడించారు.