న్యూఢిల్లీ, నవంబర్ 16: పౌర విమానయ శాఖలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు రికార్డు సృష్టించారు. 2014లో బాధ్యతలను చేపట్టిన ఆయన అప్పటినుండి 42 నెలలుగా శాఖ బాధ్యతలు నిర్వహిస్తూ ఏకైక మంత్రిగా చరిత్రలో నిలిచారు. అశోక్ గజపతి రాజు హయాంలో పౌర విమానయాన శాఖ సాధించిన పురోగతి గురించి చెప్పాలంటే.. దేశ వ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న 80 ఎయిర్ పోర్ట్ లను అందుబాటులోకి తెచ్చారు. సామాన్యుల కోసం ప్రాంతీయ అనుసంధాన పథకం (రీజనల్ కనెక్టివిటీ స్కీమ్)ను రూపొందించారు. ఈ పథకం కింద చిన్నతరహా పట్టణాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేసి, అక్కడికి విమాన రాకపోకలు జరిగేలా చర్యలు చేపట్టారు. ఆయన బాధ్యతలు స్వీకరించే నాటికి సరళతర వ్యాపార నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్)లో ఆ శాఖ 10వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 3వ స్థానంలో నిలిచింది. పౌర విమానయ శాఖ అభివృద్ధికి అయన ఎంతో దోహదపడ్డారు.