న్యూఢిల్లీ, నవంబర్ 15 : ప్రముఖ భారత్ మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా లో చాలా ఉత్సహంగా తన అభిప్రాయాలను తెలుపుతారు. మొన్న కివీస్- ఇండియా సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ ఆటగాడు టేలర్ హిందీ కి ఫిదా అయిన మన వీరూ, తాజాగా బాలల దినోత్సవ సందర్భంగా బాల అమరవీరుడిని దేశానికి పరిచయం చేశారు. 1938 అక్టోబర్ 11న ఒడిశాలోని ధేన్కనల్ జిల్లా నీలకంఠపూర్లో జరిగిన సంఘటనను సెహ్వాగ్ ట్వీట్లో తెలిపాడు. "ప్రజామండల్ ఆందోళన్ బాలల వర్గంలో సభ్యుడైన బాజీ రౌత్, బ్రాహ్మణి నది పడవల రక్షకుడిగా ఉండేవాడు. బ్రిటీషువారు అమాయకులను అకారణంగా చంపేస్తున్నారని తెలుసుకున్న బాజీ రౌత్, వారి బలగాలను బ్రాహ్మణి నది దాటించేందుకు నిరాకరించాడు. బాజీ రౌత్ తమ ఆదేశాలను బేఖాతరు చేసినందుకు కోపోద్రిక్తుడైన బ్రిటీషు అధికారి బాలుడు అని చూడకుండా తలమీద తుపాకి వెనుక భాగంతో కొట్టాడు. అయిన మాట వినలేదు దీంతో బ్రిటీష్ బలగాలు తుపాకి పేల్చి బాజీ రౌత్ను హతమార్చాయి. అతనితో పాటు అతని స్నేహితులు లక్ష్మణ్ మాలిక్, ఫాగు సాహూ, హృషీ ప్రధాన్, నాటా మాలిక్లను కూడా బ్రిటిష్ సైనికులు చంపేశారు. చిన్నవయసులోనే స్వాతంత్ర్యం అర్థం తెలుసుకుని, దేశం కోసం ప్రాణాలిచ్చిన బాజీ రౌత్ను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ ట్విట్ కు చాలామంది ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసుత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యేకంగా తన ధన్యవాదలను తెలిపారు.