ముంబై, నవంబర్ 15 : భారత్ చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ తో 1989, నవంబర్ 15 న కృష్ణమాచారి శ్రీకాంత్ సారథ్యంలో టీమిండియా పాక్లో పర్యటించింది. తొలి టెస్ట్ కరాచీలో నవంబర్ 15 న ప్రారంభమైంది. పాక్ మొదటి ఇన్నింగ్స్ లో 409 పరుగులు చేయగా, లక్ష్య చేధనలో టీమిండియా 262 పరుగులే చేసింది. 41 పరుగులకే 4 వికెట్లు నష్టపోయిన స్థితిలో బ్యాటింగ్ కు దిగిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 24 బంతులాడి 15 పరుగులు చేశాడు. వకార్ యూనిస్ క్లీన్బౌల్డ్ చేయడంతో టెండూల్కర్ పెవిలియన్ చేరాడు. ఒక క్రికెటర్ గా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సచిన్ క్రికెట్ ప్రస్థానం ఈ మ్యాచ్ తో మొదలైంది. సరిగ్గా 28 ఏళ్ల క్రితం ఇదే రోజున (1989, నవంబర్ 15) క్రికెట్ దేవుడు సచిన్ టెస్టు అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి తన ఆటతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాలు అందించిన ఘనత సొంతం చేసుకున్న ఈ లిటిల్ మాస్టర్, నవంబర్ 14 2013 వెస్ట్ ఇండీస్ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు.