ప్రైవేట్‌ ట్రావెల్‌ మినీబస్సు దగ్ధం..

SMTV Desk 2017-11-14 14:24:15  Private Travel Minibus Burned, vijayanagaram to araku journey

విజయనగరం, నవంబర్ 14 : విజయనగరం నుంచి అరకు వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్‌ మినీబస్సు దగ్ధమైంది. విజయనగరం ఫుట్‌వేర్‌ కంపెనీకి చెందిన 28 మంది ఉద్యోగులు అరకు లోయలోని అందాలను చూసేందుకు మినీ బస్సులో బయలుదేరారు. ఆ బస్సు తాటిపూడి రాగానే రిజర్వాయర్‌ చూసేందుకు ఆ ఉద్యోగులంతా బస్సు దిగి వెళ్లారు. ఆ తర్వాత తిరిగి బస్సు ఎక్కారు. అనంతరం ఆ బస్సు కొద్ది దూరం ప్రయాణించాక ఒక్కసారిగా వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు దిగి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాని వారి వెంట తెచ్చుకున్న సుమారు రూ.20,000 విలువైన వస్తువులు ఈ ప్రమాదంలో కాలిపోయాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా డ్రైవర్ పరారీలో ఉన్నాడని అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.