న్యూఢిల్లీ, నవంబర్ 14 : సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆన్లైన్ చర్చా వేదిక కోరా (www.quora.com)లో పాల్గొని ఓ ప్రశ్నకు విశ్లేషణాత్మక సమాధానం రాశారు. ఇందులో భాగంగా "భారత దేశానికి బుల్లెట్ రైలు అవసరమా"..? అన్న ప్రశ్నకు స్పందించిన పీయూష్.. అద్భుత విశ్లేషణాత్మక వివరణ ఇచ్చారు. ఇంతకీ ఆ వివరణ ఏంటంటే.. "ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్కు చాలా అవసరాలున్నాయి. దేశ అభివృద్ధి ప్రణాళికలో ప్రస్తుత రైల్వే నెట్వర్క్ అప్గ్రెడేషన్ ఒక భాగం. అందులో భాగంగా వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైలు అవసరమే. ఎందుకంటే రక్షణతో పాటు, వేగానికి ప్రాధాన్యతను ఇచ్చి, ప్రజలకు సేవలందించే బుల్లెట్ రైలు భారత్ రైల్వే పరంగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుంది. కొత్త సాంకేతికతకు అలవాటు పడే క్రమంలో ఇబ్బందులు తప్పవు. ఐతే అవి దేశానికి కచ్చితంగా లాభం చేకూరుస్తాయి. గతంలో మొబైల్ ఫోన్ల సాంకేతికత వినియోగానికి భారతీయులు సిద్ధంగా లేరని అనుకున్నారు. కాని ఇప్పుడు మొబైల్ను ఎక్కువగా ఉపయోగిస్తున్న రెండో అతిపెద్ద దేశం భారత్. బుల్లెట్ రైలు ప్రాజెక్టు సైతం ఇలాంటిదే" అని మంత్రి వివరణ ఇచ్చారు. గోయల్ విశ్లేషణను దాదాపు 33,000 మంది చదవడం విశేషం.