ప్యాంగ్యాంగ్, నవంబర్ 14 : సొంత సైనికుడినే చంపేందుకు ఉత్తరకొరియా సైన్యం ప్రయత్నించింది. అసలు విషయంలోకి వెళితే.. ఉత్తరకొరియా సైనికుల్లో తోటి సైనికుడు సోమవారం పన్మున్జామ్ గ్రామం వద్ద నుంచి తన వాహనంలో దక్షిణకొరియా వైపు వెళ్లబోయాడు. అది గమనించిన ఉ.కొరియా సైనికులు వెంటనే అతడిపై అత్యంత దారుణంగా 40 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. పన్మున్జామ్ సరిహద్దు ప్రాంతంలో యునైటెడ్ నేషన్స్ కమాండ్(యూఎన్సీ) సిబ్బంది వెంటనే గమనించి హెలికాప్టర్లో అతడిని ఆసుపత్రికి తరలించగా, శరీరంలోకి ఆరు బుల్లెట్లు దూసుకుపోవడంతో తీవ్రంగా గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులు జరిగిన ప్రాంతంలో పర్యాటకులు ఎక్కువగా ఉంటారు. ఆ సమయంలో పర్యాటకులు అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీనిపై దక్షిణకొరియా సైనికబృందం స్పందించి.. ఈ కాల్పుల్లో తమ యూఎస్కు చెందిన సైనికులెవరూ గాయపడలేదని వెల్లడించింది.