విశాఖ, నవంబర్ 14 : విశాఖపట్నం విమానాశ్రయంలో విమానం టేకాఫ్ చేసే సమయంలో ఓ అడవి పంది రన్వేపైకి దూసుకొచ్చి విమానం టైరును ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సుమారు గంట పాటు ఆకాశంలో అలా అలా చక్కర్లు కొట్టించాడు. అనంతరం ఆ విమానాన్ని తిరిగి అదే విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘటనతో అసలేం జరిగిందో తెలీని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అసలు విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. అయితే విమానాన్ని ఢీకొ౦ది ముళ్ల పంది అని, అది రన్వేపైకి ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా ఆ విమానాన్ని జాగ్రత్తగా పరిశీలించి కావలసిన చోట మరమ్మత్తులు చేసి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించాక హైదరాబాద్ బయలుదేరింది.