లఖ్నవూ, నవంబర్ 13 : ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్నవూ విమానాశ్రయంలో ఓ దివ్యాంగురాలు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు సాయం చేయడానికి అక్కడకు వచ్చిన ఇండిగో సిబ్బంది చక్రాల కుర్చీలో ఉన్న ఆమెను తీసుకెళుతుండగా కుర్చీ అదుపు తప్పడంతో ఆమె కింద పడిపోయింది. దీంతో ఆమెకు దెబ్బలు తగలడంతో వెంటనే స్పందించిన సిబ్బంది ఆమెను దగ్గర లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా ఈ విషయంపై ఇండిగో సంస్థ వివరణ ఇస్తూ.. ఇది కావాలని చేసిన పని కాదని పొరపాటున ఆమె కింద పడిపోయారని ప్రయాణికురాలికి క్షమాపణలు చెప్పింది. ఇటీవల వేర్వేరు ఘటనలలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి సింధుతో అమర్యాదకరంగా ప్రవర్తించడమే కాకుండా ఓ ప్రయాణికుడిని చితకబాదిన విషయ౦ తెలిసి౦దే.