న్యూఢిల్లీ, నవంబర్ 13 : ఆట... ఫిట్ నెస్... ఈ రెండింటికి విడదీయరాని బంధం ఉంది. ప్రస్తుత భారత్ క్రికెట్ జట్టు విజయాలలో ఫిట్ నెస్ పాత్ర కీలకమైనది. ఇంతవరకు స్కిన్ ఫోల్డ్ టెస్ట్, డేక్సా టెస్ట్, యోయో టెస్ట్, జరపిన బిసీసీఐ ఇప్పుడు వారి ఫిట్ నెస్ కోసం తాజాగా వారికి డీఎన్ఏ పరిక్షలు కూడా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే ఆటగాళ్లిప్పుడు డీఎన్ఏ పరీక్షకు హాజరవుతున్నారు. ప్రతి ఆటగాడి జన్యు సంబంధ ఫిట్నెస్ వివరాలు ఈ పరీక్షతో తెలుస్తాయి. ఓ ఆటగాడు తన వేగాన్ని, కండలను పెంచుకోవడానికి.. కొవ్వును కరిగించుకోవడానికి ఈ పరీక్ష దోహదం చేస్తుంది. జట్టు ట్రైనర్ శంకర్ బసు సూచన మేరకు బీసీసీఐ ఈ కొత్త పరీక్షను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఈ డీఎన్ఏ పరీక్షనును తొలిసారి ఎన్బీఏ(బాస్కెట్ బాల్)లో ప్రవేశపెట్టారు.