కేరళ, నవంబర్ 12 : రాష్ట్రాన్ని పర్యాటక స్థానంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేరళలోని కొచ్చిలో పర్యటిస్తున్నారు. అక్కడ అత్యాధునిక పరికరాలతో లూలు గ్రూప్ నిర్వహించిన కన్వెన్షన్ సెంటర్ మాల్ ను ముఖ్యమంత్రి సందర్శించారు. పదివేల సీటింగ్ సామర్ధ్యంతో అక్కడ ఏర్పాటు చేసిన కన్వెన్షన్ కేంద్రం ప్రసిద్ధి పొందింది. 250 గదులు, 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ దీనిని ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణాన్ని చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. విశాఖలోని లూలు గ్రూప్ భారీ కన్వెన్షన్ కేంద్ర౦ నిర్మించనుండగా.. కొచ్చీని తలదన్నేదిగా ఉండాలని ఆ సంస్థ ప్రతినిధులకు సీఎం పలు సూచనలు చేశారు. కొచ్చిలోని కన్వెన్షన్ సెంటర్ కు వెనుక జలాల ముఖ ద్వారం ఉండగా, విశాఖలో నిర్మించే కన్వెన్షన్ కు సముద్రం ఒక అదనపు ఆకర్షణ కానుందని, ఆ దిశగా నిర్మాణం చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే బిడ్డింగ్ ప్రక్రియ పూర్తైనందున కన్వెన్షన్ సెంటర్ మాల్ నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తి చేయాలని అధికారులను కోరారు.