ముంబయి, నవంబర్ 12 : ఈ ఏడాది భారతీయ రైల్వే శాఖకు జరిమానాతో భారీగా ఆదాయం సమకూరింది. గత ఎదునేలలుగా రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి జరిమానా విధించి దాని వ్యవధిలో రూ.100.67కోట్లు వసూలు చేసినట్లు కేంద్ర రైల్వే శాఖ(సీఆర్) తెలిపింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కమర్షియల్ డిపార్ట్మెంట్ నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ ద్వారా టికెట్ లేకుండా అక్రమంగా ప్రయాణిస్తున్న ప్రయాణికులను అధికారులు పట్టుకున్నారు. వారిపై 19.82లక్షల కేసులను నమోదు చేశారు. గతేడాది ఇదే సమయంలో టికెట్ లేని ప్రయాణికులపై 16.37లక్షల కేసులు నమోదు కాగా, ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్య 21.08శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. గతేడాది జరిమానా కింద సీఆర్కు రూ.80.02కోట్లు ఆదాయం రాగా, ఈ ఏడాది 25.81 శాతం పెరుగుదలతో రూ.100.67కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై రైల్వేశాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు.