బెంగళూరు, నవంబర్ 12 : ప్రముఖ కన్నడ జర్నలిస్టు గౌరీ లంకేశ్ సెప్టెంబర్ 5న దారుణ హత్యకు గురికావ్వడంతో, నిందితుల వివరాలు చెప్పిన వారికి రూ. 10లక్షల రివార్డు అందిస్తామంటూ ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చనీయాంశమైంది. బెంగళూరులోని ఆమె ఇంటి ముందే గుర్తుతెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి హత్య చేసిందెవరో తనకు తెలుసని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రెస్క్లబ్లో విలేకరులతో సమావేశమైన ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దీనిపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ వివరాలను వెల్లడించలేమని, త్వరలో హంతకులను పట్టుకుంటామని అన్నారు. అయితే ఎన్ని వారాలు అని మంత్రి స్పష్టంగా చెప్పలేదు గానీ.. నిందితులను కచ్చితంగా అరెస్టు చేస్తామని వెల్లడించారు. జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.